తెలంగాణ  హైకోర్టుకు తొలి మహిళా సీజే...  ప్రమాణస్వీకారం చేసిన హిమ కోహ్లీ

  • ఇటీవల తెలుగు రాష్ట్రాల హైకోర్టుల సీజేలు బదిలీ
  • తెలంగాణ హైకోర్టు నూతన సీజేగా హిమ కోహ్లీ
  • ఇప్పటివరకు ఢిల్లీ హైకోర్టులో జడ్జిగా ఉన్న హిమ కోహ్లీ
  • హిమ కోహ్లీతో ప్రమాణస్వీకారం చేయించిన తమిళిసై
  • హాజరైన సీఎం కేసీఆర్, మంత్రులు
ఇటీవల తెలుగు రాష్ట్రాల హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తులు బదిలీ అయిన సంగతి తెలిసిందే. ఏపీ హైకోర్టు నుంచి జస్టిస్ జేకే మహేశ్వరి సిక్కిం హైకోర్టుకు బదిలీ కాగా, ఆయన స్థానంలో జస్టిస్ అరూప్ గోస్వామి నూతన ప్రధాన న్యాయమూర్తిగా వచ్చారు.

అటు తెలంగాణ హైకోర్టు సీజేగా వ్యవహరించిన జస్టిస్ రాఘవేంద్ర సింగ్ చౌహాన్ ఉత్తరాఖండ్ హైకోర్టుకు బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో జస్టిస్ హిమ కోహ్లీ తెలంగాణ హైకోర్టు నూతన ప్రధాన న్యాయమూర్తిగా నియమితులయ్యారు. ఆమె తెలంగాణ హైకోర్టుకు తొలి మహిళా ప్రధాన న్యాయమూర్తి.

ఇవాళ జరిగిన కార్యక్రమంలో తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ జస్టిస్ హిమ కోహ్లీతో ప్రమాణస్వీకారం చేయించారు. ఈ ప్రమాణస్వీకార కార్యక్రమంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, కేబినెట్ మంత్రులు, పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. కాగా, జస్టిస్ హిమ కోహ్లీ ఇప్పటివరకు ఢిల్లీ హైకోర్టులో న్యాయమూర్తిగా వ్యవహరించారు.

Hima Kohli
Telangana High Court
Chief Justice
Tamilisai Soundararajan
Telangana

More Telugu News